సాక్షి, చైన్నె: తమిళనాడుకు చెందిన ఆదిద్రవిడ (ఎస్సీ), గిరిజన (ఎస్టీ) విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో పెద్ద సంఖ్యలో ప్రవేశాలు పొందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 36 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఎన్ఐఎఫ్టీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించేందుకు నీట్, జేఈఈ, క్లాట్, ఐఎంయూ వంటి పోటీ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తోంది. ఇది పోటీ పరీక్షలలో విద్యార్థులకు ప్రయోజకరరంగా మారి ఉన్నాయి. ఈ ఏడాదితో మొత్తం 357 మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది మొత్తం 42 పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది 80 మంది ఆదిద్రవిడ విద్యార్థులు, 277 మంది గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు.
చారిత్రక ఘనతలు
చరిత్రలోనే మొదటిసారిగా రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీలో తమిళనాడుకు చెందిన ఒక గిరిజన విద్యార్థి ప్రవేశం సాధించాడు. అలాగే, నేషనల్ లా యూనివర్సిటీ ఇరులర్ తెగకు చెందిన ఒక విద్యార్థి న్యాయ విద్య కోర్సులో సీటు సాధించారు. ప్రభుత్వ శిక్షణా కేంద్రం ట్రైనర్లు సుమతి ఈసందర్భంగా పేర్కొంటూ, న్నో ప్రతిబంధకాలను అధిగమించి ముందుకు రావడం ఈ విద్యార్థులకు ఒక సవాలుగా వివరించారు. వాసుకి ఫౌండేషన్ భాగస్వామ్యంతో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.
కేరళ సీటు సాధించిన కమలేష్ ఆనందం
సేలం జిల్లా గెంగవల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమారుడైన కమలేష్ జేఈఈ పరీక్షలో 78% మార్కులు సాధించి కేరళలోని కొట్టాయంలో ఐఐఐటీలో బీ టెక్ సీటు సాధించాడు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అన్నాదురై, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శి సుబ్బయ్యన్ల మార్గదర్శకత్వంలో కుమిళి శిక్షణా కేంద్రం ద్వారా ఉచిత శిక్షణ పొంది ఈ సాధన చేసినట్లు కమలేష్ తెలిపాడు.
సామాజిక న్యాయ మంత్రి వన్నియరసు హర్షం
మొదటిసారిగా ఏవియేషన్ (విమానయాన) రంగంలో తమ విద్యార్థులు అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమని సామాజిక న్యాయ శాఖ మంత్రి వన్నీరసు తెలిపారు. కేవలం రిజర్వేషన్ల స్థాయిని మించి విద్యార్థులు తమ ప్రతిభతో సీట్లు సాధిస్తున్నారని, డ్రాపౌట్ విద్యార్థులపై కూడా దృష్టి సారించి వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.


