సాక్షి, చైన్నె : భారతదేశంలోని నాలుగు దిక్కులలో 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించే బృహత్తర ప్రాజెక్ట్లో భాగంగా, తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతున్న మూడో విగ్రహ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ను 2008లో’హెచ్సీ నందా ట్రస్ట్ ట్రస్టీ, హనుమాన్ భక్తుడైన నిఖిల్ నందా (49) ప్రారంభించారు.
హనుమాన్ విగ్రహాల ప్రాజెక్ట్ ప్రస్థానం
నాలుగు దిక్కులలో హనుమాన్ విగ్రహంప్రతిష్ట దిశగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. దేశానికి ఉత్తరం లో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా నగర సమీపంలో ఉన్న జక్కు కొండపై మొదటి విగ్రహ నిర్మాణం 2008లో ప్రారంభమై, 2010లో పూర్తయ్యింది. పశ్చిమం దిక్కున గుజరాత్లోని మోర్బీలో ఉన్న పరమపూజ్య బాపు కేశవానంద్ ఆశ్రమంలో 2018లో రెండో విగ్రహ పనులు ప్రారంభమయ్యాయి. 2022లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దక్షిణం దిక్కున రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రామేశ్వరంలో 3వ విగ్రహ పనులు జరుగుతున్నాయి. తూర్పు దిక్కున నాల్గో విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.
రామేశ్వరం విగ్రహ విశేషాలు
రామేశ్వరంలోని ఓలైక్కుడా సముద్రతీరం సమీపంలో రూ.83 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్కు 2022లో శంకుస్థాపన చేశారు. ఈ హనుమంతుడి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం ఉందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.


