సాక్షి, చైన్నె: తమిళనాడులో ప్రతి ఇంట్లోనూ పట్టభద్రులు, వైద్యులు ఉన్నారంటే దానికి ద్రవిడ ఉద్యమమే కారణమని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో వచ్చిన ఒక మార్పు ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చిందని, లక్షలాది మంది చేసిన పొరపాటు వల్ల ఈరోజు కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చైన్నెలో సోమవారం జరిగిన అమృతం ఫ్యామిలీ వివాహ మహోత్సవంలో ప్రతి పక్ష నేత ఉదయ నిధితో కలిసి పాల్గొని ఆయన ప్రసంగించారు.
ద్రవిడ ఉద్యమ ప్రాముఖ్యత:
అర్ధ శతాబ్దం క్రితం చూస్తే ఎక్కడో ఒకరు మాత్రమే డాక్టర్ లేదా గ్రాడ్యుయేట్ కనిపించేవారన్నారు. అయితే, ఈరోజు ఊరూరా, గ్రామా గ్రామాన, ప్రతి ఇంట్లో పట్టభద్రులు, వైద్యులు ఉన్నారంటే దానికి మూలకారణం ద్రవిడ ఉద్యమమే అనే విషయాన్ని ఎవరూ మరచిపోకూడదన్నారు. ఈనాటి యువత చరిత్రను, ప్రస్తుత పరిస్థితులకు కారణమైన ఉద్యమాలను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమిళనాడులో వచ్చిన మార్పు కాస్తా తీవ్ర నిరాశగా మారిందని, లక్షలాది మంది చేసిన పొరపాటు ఈరోజు కోట్ల మంది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలని పిలుపునిచ్చారు.
యువతకు .. నవదంపతులకు పిలుపు
రాబోయే కాలంలో ప్రజలు , యువత ఈ పరిస్థితులపై లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవదంపతులైన ఇలక్కియ, డాక్టర్ గిరిధర్లను ఆశీర్వదించిన స్టాలిన్... పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లను మాత్రమే నామకరణం చేయాలని ప్రత్యేకంగా కోరారు. మహాకవి భారతిదాసన్ చెప్పినట్లుగా ఇంటికి వెలుగుగా, దేశానికి సేవకులుగా నవదంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.


