రాష్ట్రవ్యాపంగా ఉన్న అన్నదాతల సంక్షేమం, పంట పొలల అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్, కనీస మద్దతు ధర వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి వినోద్ వెల్లడించారు. ఈమేరకు ఆయన గురువారం టీవీకే ప్రభుత్వం తరపున తొలి వ్యవసాయ బడ్జెట్ను దాఖాలు చేశారు.
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగం అభివద్ధి, సేంద్రియ సాగు ప్రోత్సాహం, సాంకేతికత వినియోగం, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అనంతరం ప్రపథమంగా జార్జ్కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం వ్యవసాయ మంత్రి వినోద్ అన్నదాత కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన బడ్జెట్ను దాఖలు చేశారు. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమారు రెండున్నర గంటలు బడ్జెట్లోని అంశాలను మంత్రి వినోద్ వివరించారు. ముందుగా సీఎం విజయ్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
బడ్జెట్లోని ప్రధాన ముఖ్యాంశాలు
ఊటీలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వ్యవసాయ సాంకేతిక పరిశోధన కేంద్రం ఏర్పాటు.
వాన్మగల్ పథకం (డ్రోన్ల వినియోగం) పేరిట 100 మంది మహిళలతో సహా 500 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ. 50 మంది మహిళలకు 50% సబ్సిడీతో డ్రోన్ల పంపిణీకి రూ.4 కోట్ల కేటాయింపు.
తుళి తుళి తన్నీర్ పథకం (నీటి యాజమాన్యం) పేరిట తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు రూ.785 కోట్లు కేటాయింపు. దీని ద్వారా 2.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 95,000 మంది రైతులకు ప్రయోజనం.
రైతుల ఆదాయ పెంపు కమిషన్ ఏర్పాటు చేస్తూ రూ.5.20 కోట్ల వ్యయం కేటాయించారు.
కోటి మంది రైతులకు రూ.4 కోట్ల వ్యయంతో నేల (సాయల్) ఆరోగ్య కార్డుల పంపిణీ.
నేల సారాన్ని రక్షించేందుకు రూ.122.51 కోట్ల బడ్జెట్తో కొత్త కార్యక్రమం.
తంజావూరు జిల్లా శాకోటైలో రూ.5 కోట్లతో నమ్మాళ్వార్ పేరిట కొత్త సేంద్రీయ వ్యవసాయ డిప్లొమా కళాశాల స్థాపన.
వ్యవసాయ యంత్రాలు, పరికరాలను వాడకముందు అద్దెకు ఇచ్చే సేవలను విస్తరించడానికి 463 కొత్త యంత్రాల కొనుగోలుకు రూ.20.31 కోట్లు.ఈ – వాడగై 2.0 యాప్ రూపల్పన.
వ్యవసాయ ఉత్పత్తులకు 100 శాతం పంటల బీమా రక్షణ కల్పించాలని నిర్ణయం.పీఎం వ్యవసాయ భీమా పథకం అమలుకు రూ. 648 కోట్లు కేటాయించారు.
సూపర్ఎల్ నినో కారణంగా 12 జిల్లాలు రాష్ట్రంలో తీవ్ర ప్రభావానికి గురి అవుతుందని అంచనా వేశారు. ఇక్కడ జిల్లా అగ్రి కల్చరల్ ప్లాన్ అమలు చేయనున్నారు.
జనరల్కేటగిరి రైతులు బోరు బావులు, బావుల ఏర్పాటు కోసం రూ.10 కోట్లు కేటాయించార.


