పేరు మార్పు తథ్యం
అధికారుల తనిఖీలు
కొరుక్కుపేట: తమిళనాడులో 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకుల ప్రచారం ముమ్మరం అయ్యింది. ఈ పరిస్థితిలో ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతోందా? లేదా? అని పర్యవేక్షించడానికి తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేక ముమ్మర నిఘా కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి. నెల్లై జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ప్లయింగ్ స్వ్కాడ్లు, స్థిర నిఘా బృందాలు 24 గంటల పాటు రొటేటింగ్ పద్ధతిలో ముమ్మర నిఘా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంలో పాళయం కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పెరుమాల్ పురంలోని ఒక ప్రైవేటు అపార్టుమెంట్లో రూ.200 కోట్లు దాచి పెట్టారని బుధవారం ఉదయం ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. అనంతరం నెల్లై, మదురైకి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ప్లయింగ్ స్వ్కాడ్లు అధికారులతో కలిసి ఆ ప్రైవేటు అపార్టుమెంట్లో సోదాలు చేయడం గందరగోళం చెలరేగింది.
కొరుక్కుపేట: మహాబలిపురంలో పురావస్తు ప్రదేశాలను సందర్శించేందుకు వేలాదిమంది తరలి వస్తున్నారు. ఈక్రమంలో అక్కడ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఆ ప్రాంతంలో ప్రైవేటు గార్డులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. కొందరు పరావస్తు శాఖ అనుమతి లేకుండా, పురాతన కట్టడాల నేపథ్యంలో ఫొటో షూట్ రీళ్లు, ఆల్భమ్ల వంటి వాణిజ్య డిజిటల్ షూటింగ్లను నిర్వహించడానికి కెమెరాలను, లైట్లను రహస్యంగా తరలిస్తున్నారు. డిజిటల్ పరికరాలు, పేలుడు పదార్థాలను తీసుకు వెళ్లడాన్ని నివారించడానికి పురావస్తుశాఖ బీచ్ ఆలయ ప్రవేశ మార్గంలో ప్రాథమిక తనిఖీ నిర్వహిస్తోంది. భద్రత కోసం మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేశామని, అదనపు బద్రత, నిఘాను కూడా పెంచామని అధికారులు తెలిపారు.
సాక్షి,చైన్నె: త్వరలో అన్నాడీఎంకే పేరును అమిత్ షా డీఎంకేగా మార్చడం తథ్యమని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత కనిమొళి ఎద్దేవా చేశారు. బుధవారం తిరువణ్ణామలై, వేలూరు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలో ఆమె ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించి ప్రజలతో మమేకం అయ్యే విధంగా ముందుకెళ్లారు.ఈసందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. అన్నా డీఎంకే తన అస్తిత్వాన్ని కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ తాజాగా అమిత్ షా డీఎంకేగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. త్వరలో ఆపార్టీ పేరును పూర్తిగా మార్చేడం ఖాయం అని చమత్కారాలు సందించారు.
తిరువొత్తియూరు: నెల్లై జిల్లా వీరనల్లూరు బజార్లో వీరవ నల్లూరుకు చెందిన అసనార్ (63) నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఎప్పటి లాగే దుకాణం ఉద్యోగులు దుకాణాన్ని మూసివేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం దుకాణాన్ని తెరచి చూడగా బంగారం, వెండి నగలు కిలో కొద్దీ చోరీ జరిగి ఉన్నట్టు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు వెళ్లి చూడగా దుకాణం వెనుక గోడలో రంధ్రం వేయబడి ఉంది. దొంగల ముఠాను పట్టుకోవడానికి వీరవ నల్లూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు అర కిలో బంగారం, 3 కిలోల వెండి నగలు దోచుకెళ్లారు. వీటి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
అన్నానగర్: ఇంట్లో ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైన్నెలోని మూర్తింగర్నగర్, వ్యాసార్పాడిలోని ప్రభుత్వ అపార్టుమెంట్ కాంప్లెక్స్లో నివసిస్తున్న దేవి (38). ఈమె తన భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె పెద్ద కుమారుడు మోనిష్రాజ్ (20). చైన్నెలోని ఒక పాలిటెక్నిక్ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం దేవి ఎప్పటిలాగే పనికి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. చాలాసార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో దాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో మోనిష్రాజ్ తన గదిలో చీరతో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చైన్నెలోని స్టాన్లీ ఆస్పత్రిలో అతడిని పరీక్షించిన వైద్యులు అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. ఎంకేపీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


