విజయ్ వ్యాఖ్య డీఎంకే, బీజేపీకి తనపై కోపం ఎందుకని ప్రశ్న తిరునల్వేలిలో దళపతికి జనం బ్రహ్మరథం
సాక్షి, చైన్నె : నిజమైన కాంగ్రెస్ వాదులు, నాయకు లు తన వెన్నంటే ఉన్నారని టీవీకే అధినేత విజయ్ వ్యాఖ్యానించారు. డీఎంకే, బీజేపీకి తనపై ఎందుకు అంత కసీ, కోపం అన్నది అర్థం కావడం లేదన్నారు. కాగా తిరునల్వేలిలో బుధవారం విజయ్ రోడ్ షోకు అపూర్వ ఆదరణ లభించింది. అడుగడుగున అభిమానులు దళపతి ..దళపతి, సీఎం...సీఎం అన్న నినాదాలు మార్మోగిస్తూ బ్రహ్మరథం పట్టారు. వివరాలు.. తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాలోని నియోజకవర్గాలలో పోటీచేస్తున్న తన అభ్యర్థులకు మద్దతుగా టీవీకే అధినేత విజయ్ బుధవారం పర్యటించారు. తిరునల్వేలిలో తొలుత ఆయన రోడ్ షోకు ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. అభిమానులు నీరాజనాలు పలుకుతూబ్రహ్మరథం పట్టారు. విజయ్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయన కాన్వాయ్ వెంబడి ద్విచక్ర వాహనాలలో దూసుకొచ్చారు. ఈ సమయంలో చోటు చేసుకున్న ప్రమాదాలలో 18 మంది వేర్వేరు చోట్ల గాయపడ్డారు. వీరికి ఆయా ప్రాంతాలలోని ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు నా వెంటే
రోడ్ షో అనంతరం జరిగిన ప్రచార బహిరంగ సభలో విజయ్ ప్రసంగిస్తూ కొందరు కోట్లు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ను తమ జేబుల్లో పెట్టుకుని ఉన్నారని,అ యితే, నిజమైన , సిద్ధాంత పరమైన కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ వాదులు, కార్యకర్తలు తన వెన్నంటే ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ చేతిలో పూర్తి అధికారం లేదని, ఒకవేళ ఆయనకు పూర్తి పవర్ ఉండి ఉంటే తన సభ జరగకుండా ఏదో ఒక అడ్డంకులు సృష్టించిఉండే వారని ధ్వజమెత్తారు. అధికారం లేని ముఖ్యమంత్రిగా ఉన్నందు వల్లే తాను సులభంగా ప్రజల వద్దకు రాగలిగానని వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే – బీజేపీ బంధం
డీఎంకే, బీజేపీ కూటములు బయటకి విడివిడిగా ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం ఆ రెండు ఒక్కటే అని ఆరోపించారు. విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని, ప్రజలకు మంచి చేయకూడదనేది వారిద్దరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి డీఎంకే ప్రభుత్వ అవినీతి చిట్టాను బయటపెడుతున్నానని, అందుకే తనపై వారు తీవ్ర కోపంతో ఉన్నారని విజయ్ తెలిపారు. ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటున్నారని, రాబోయే కాలంలో డీఎంకే అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. తనపై జరుగుతున్న కుట్రలను ప్రజల ముందు ఉంచుతున్నానంటూ తీవ్ర ఉద్వేగంతో ఇటీవల కాలంగా జరిగిన సంఘటనలను గుర్తు చేశారు.
ప్రజలే నా బలం
30–33 ఏళ్లుగా తాను ప్రతి ఇంటిలో ఒకడిగా మారినట్టు పేర్కొన్నారు. పార్టీ పెట్టిన తర్వాత తాను ప్రజల వద్దకు వెళ్లలేదని పేర్కొంటూ, ప్రతి ఇంటి గడప తొక్కిన తర్వాతే తాను పార్టీ పెట్టానన్న విషయాన్ని వ్యతిరేక శక్తులు గుర్తించాలని హితవు పలికారు. ప్రజలతో తనది రాజకీయ బంధం కాదని, జన్మజన్మల బంధం అని ఉగ్వేగంగా వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థులు ఎవరూ అంబానీలు, అదానీలు కాదని.. సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారని విజయ్ తెలిపారు. 234 నియోజకవర్గాల్లోనూ ఈ విజయ్నే అభ్యర్థి అని భావించాలని పిలుపునిచ్చారు. అధికారం అప్పగిస్తే ప్రజల సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా నేను ముట్టుకోనని, ప్రజలకు అన్యాయం జరగనివ్వననంటూ ఆమేరకు అద్బుత పాలన అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఐదేళ్ల మార్పు కోసం కాదని, 50 ఏళ్లకోసారి వచ్చే అద్భుతమైన అవకాశమని, దీనిని వదులుకోవద్దని విజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీవీకే అధికారంలోకి వస్తే మహిళలు, యువత, రైతులు , మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తూత్తుకుడి,కన్యాకుమారి జిల్లాలో విజయ్ పర్యటన అభిమాన జన సాగరం నడుమ జరిగింది. ఇక, శుక్రవారం విజయ్ కడలూరులో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచార ఏర్పాట్లకు పోలీసులు 16 షరతులను విధించారు.
సభకు తరలి వచ్చిన అభిమాన లోకం
రోడ్ షోలో విజయ్కు బ్రహ్మరథం
గల్లా పెట్టె కూటమి
డీఎంకేది కకా వికలమైన గల్లా పెట్టే కూటమి (డబ్బుల పెట్టే) కూటమి అని పేర్కొంటూ, కొల్ల గొట్టిన సొమ్ముతో ఏర్పడిన ఈ కూటమి తాజాగా ముక్కలై పోయి ఉందన్నారు. ఈ కూటమిలోని పార్టీలు ఒకరికొకరు ఓట్లు వేసుకునే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. డీఎంకే, బీజేపీలకు తనపై ఎందుకంత కసి? దానికి కారణం వారి ఇంట్లోనే ఇప్పుడు ’విజిల్’ శబ్ధం బలంగా వినిపిస్తుండటమే అని విజయ్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ కొన్ని కోట్లు ఇచ్చి కాంగ్రెస్ను తన జేబులో వేసుకున్నారని, కానీ నిజమైన కాంగ్రెస్ వాదులు తన పక్కనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తనను దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని విజయ్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవడానికి ’జననాయగన్న్’ సినిమాను ముంచేయాలని చూశారని మండిపడ్డారు. ప్రచారం విషయంలో తన కోసం మాత్రమే ప్రత్యేక నిబంధనలు పెట్టి, ప్రజలను కలవకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు సరిగ్గా 30 రోజుల ముందు తన చుట్టూ ఉన్నవారిపై తప్పుడు ప్రచారాలు చూస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


