తిరుమలగిరి (తుంగతుర్తి) : పోరాటాలతోనే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు. తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కల్లాల వద్దనే ఎలా కొనుగోలు చేస్తున్నదో, అలానే చేనేత సహకార సంఘాల వద్ద కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకపొతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని, చేనేత కార్మికులకు హౌస్ కమ్ వర్క్ షెడ్ మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా అమలు చేయాలని కోరారు. వంగరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం నాయకులు మహేశ్వరం జయచందర్, వైట్ల మురళి, వెంకన్న, నరసింహస్వామి, మద్దూరి వెంకన్న, పొన్నం వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి సోమనారాయణ, మల్లయ్య పాల్గొన్నారు.
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్


