భానుపురి (సూర్యాపేట) : వర్షాభావ నేపథ్యంలో వరిపంట సాగుచేసి నష్టపోవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి ఎల్నినో ప్రభావంపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సెప్టెంబర్ నాటికి ఎల్నినో ప్రభావంతో వానలు తక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, ఎస్సారెస్పీలలో సమృద్ధిగా నీరు లేనందున నీటి విడుదలపై స్పష్టత లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వరిసాగుకు వెళ్లకుండా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.
10 రోజుల పాటు పంట
మార్పిడిపై స్పెషల్ డ్రైవ్
పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రైతులతో మాట–పంట మార్పిడికి బాట అనే పంట మార్పిడి పథకాన్ని స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఈ నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. 10 రోజుల పాటు ప్రతి అధికారి కనీసం 10 మంది రైతులను వ్యక్తిగతంగా కలిసి అవగాహన కల్పిస్తారన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు.
కరువు వచ్చినా అండగా ఉంటాం :
ఎమ్మెల్యే మందుల సామేల్
రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నా ప్రజలెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి ఈనెల 10న నాగార్జున సాగర్లో మహా వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


