నాగార్జునసాగర్ : వర్షాలు కురవాలని ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున సీఎం రేవంత్రెడ్డి చేపట్టే మహా వరుణయాగానికి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాగర్లో వరుణయాగం ఏర్పాట్లను ఆయన.. ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో కలిసి పరిశీలించారు. యాగశాల, ప్రవచనశాల, హెలిపాడ్తో తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల10న ఉదయం 4గంటలకు వరుణయాగం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ, నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


