సూర్యాపేటటౌన్ : అడవుల సంరక్షణకు పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. అడవులను నాశనం చేయవద్దని, వాటి విస్తీర్ణం పెరిగితేనే కరువు లాంటి తీవ్ర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూముల ఆక్రమణలను నిరోధించాలని ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణ, పోడు భూములకు సంబంధించి ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఫారెస్ట్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల సహకారంతో ముందుకు సాగాలన్నారు. అడవుల విషయంలో తరచూ సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి, వారికి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఫారెస్ట్, పోలీస్ పరిధిలో నమోదైన పాత కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్రెడ్డి, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆదిత్య, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


