సూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల మోదీ పాలనలో రైతులకు, కార్మికులకు తీరని నష్టం జరిగిందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేసిన సందర్భంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం దుర్మార్గం అన్నారు. వీటికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ఎలుగురి గోవిందు, మేకనబోయిన శేఖర్, తదితరులు పాల్గొన్నారు


