గుర్రంపోడు : మద్యం అనుకుని పొరపాటున కాళ్ల నొప్పులకు వాడే తైలం తాగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తేనపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. తేనపల్లి గ్రామానికి చెందిన కాసర్ల బక్కయ్య(75) నివాసముంటున్న ఇంటి పక్కన ఆదివారం దశదిన కర్మ జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ ఇంటి పరిసరాలు శుభ్రం చేయడానికి బక్కయ్య కూలీగా వెళ్లాడు. శుభ్రం చేసే క్రమంలో అక్కడ కనిపించిన కాళ్ల నొప్పులకు వాడే కేసరి తైలం సీసాను మద్యం సీసా అనుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం బక్కయ్య తన ఇంట్లో భోజనం చేసిన తర్వాత మద్యం అనుకొని సెల్ఫ్లో ఉన్న కేసరి తైలం తాగాడు. కొద్దిసేపటి తర్వాత కడుపులో మంటగా ఉండి వాంతులు చేసుకోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు సీసాను పరిశీలించి అది కాళ్ల నొప్పులకు వాడే తైలంగా గుర్తించి వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుమారుడు కాసర్ల వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


