నకిరేకల్ : సెల్ఫోన్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నకిరేకల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సీఐ హరిబాబు వెల్లడించారు. శాలిగౌరారం మండలం మాదారంకలాన్ గ్రామానికి చెందిన గర్రె లక్ష్మయ్య గత నెల 17న తన సెల్ఫోన్ పోయిందని నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మంగళవారం ఉదయం నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారు హైదరాబాద్ నుంచి కారులో వచ్చి సెల్ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వారి నుంచి రూ.3.50లక్షల విలువ చేసే 21 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన బేతంపల్లి ప్రభు, సిద్దిపేట జిల్లా రంగదంపల్లి గ్రామానికి చెందిన ఆవుల విజయ్, ఏపీలో నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన ఎరుకల శివశంకర్ ఉన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల యజమానులను గుర్తించి వారికి అందజేస్తామని సీఐ తెలిపారు.
21 సెల్ఫోన్లు, కారు స్వాధీనం


