సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో ఓపీ, ఐపీ వివరాలు..
జ్వరంతో ఆసుపత్రిలో చేరా
హుజూర్నగర్లో వైద్యుల కొరత
సూర్యాపేటటౌన్, హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా ప్రజలను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి పెరిగింది. ఔట్ పేషెంట్ల సంఖ్య గతంతో పోల్చితే 50శాతం పెరిగింది. రక్తపరీక్ష కిట్ల కొరతతో ఆసుపత్రికి వచ్చిన రోజే రిపోర్టులు ఇవ్వడం లేదని, రెండు రోజుల సమయం పడుతుందని రోగులు వాపోతున్నారు. మందులు కూడా అన్ని ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రికి రోగుల క్యూ
జిల్లా కేంద్ర ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వస్తున్నారు. రోజుకు 1100 మందికి పైగా ఓపీ నమోదవుతుండటంతో ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. రోగుల్లో చాలామందికి డెంగీ, టైఫాయిడ్ అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్యులు రక్త పరీక్షలు సూచిస్తున్నారు. ఆస్పత్రిలో డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణకు అవసరమైన కిట్లు సరిపడా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు.
ఒకరోజు తర్వాతే రిపోర్ట్లు
సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో రక్త నమూనాలు ఇచ్చిన వారికి అదేరోజు ఫలితాలు అందడం లేదు. రిపోర్టు కోసం ఒక రోజు వేచి చూడాల్సి వస్తోంది. దాంతో చికిత్స ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు ఉదయం 9.15గంటలకు రావాల్సి ఉండగా 11గంటల వరకు వస్తున్నారు. దాంతో ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారు. ఈసీజీ, ఎక్స్రే మిషన్లు ఒక్కొక్కటే ఉండటంతో రోగులు క్యూ కట్టాల్సి వస్తున్నది.
వైద్యుల పోస్టులు ఖాళీ
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పలు డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కొందరు బదిలీ కాగా ఆ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. రెండు గైనకాలజిస్టులు, ఒక జనరల్ మెడిసిన్, రెండు రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఈఎన్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఫ పెరిగిన మలేరియా,
టైఫాయిడ్, డెంగీ కేసులు
ఫ ప్రభుత్వ ఆసుపత్రులకు
రోగుల తాకిడి
ఫ పరీక్షల కిట్లు లేక రోగ నిర్ధారణకు రెండు రోజుల సమయం
ఫ వసతులు, వైద్యుల
కొరతతో తప్పని అవస్థలు
తేదీ ఓపీ ఐపీ
జూలై 27 1130 82
28 1017 60
29 1100 70
30 1030 50
31 1100 65
ఆగస్టు 1 1050 60
మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో సూర్యాపేట ఆసుపత్రికి వచ్చాను. వైద్యులు రక్త పరీక్షలు చేశారు. రక్త కణాల సంఖ్య తగ్గిందని, వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. వైద్యులు మంచిగానే చికిత్స అందిస్తున్నరు. – ఎ.శ్రీను, గాయంవారిగూడెం
హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. వంద పడకల ఆస్పత్రిలో దాదాపు 35 మంది వరకు వైద్య నిపుణులు ఉండాలి. ప్రస్తుతం 15 మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈఎన్టీ, కంటి పరీక్షల పరికరాలు, శస్త్రచికిత్సల పరికరాలు అందుబాటులో లేవు. ల్యాబ్లో వివిధ పరీక్షలు చేసేందుకు సరిపడా పరికరాలు లేక సేకరించిన నమూనాలను సూర్యాపేట టీ హబ్కు పంపుతున్నారు. సీటీ స్కాన్ కేంద్రం ప్రారంభించినప్పటికీ రేడియోలజిస్ట్ లేక ఫలితం లేకుండా పోయింది. బ్లడ్ స్టోరేజీ సెంటర్ ప్రారంభించినప్పటికీ పరికరాలు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. రోగులకు అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సి వస్తోంది


