సూర్యాపేటటౌన్ : ప్రజల్లో అవగాహన, అప్రమత్తతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబర్ వారియర్ సిబ్బంది, పోలీసు అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాలపై వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదు చేసి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. బాధితులు మోసపోయిన డబ్బును సాధ్యమైనంత త్వరగా వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలని సూచించారు. దీనికోసం బ్యాంకులు, కోర్టు అధికారులతో తగిన సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సమస్యగా మారాయని, సిబ్బంది ప్రతి కేసును ఎంతో బాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. సమావేశంలో సైబర్ వారియర్ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ నరసింహ


