అనంతగిరి : సాగర్ ఎడమ కాల్వకు విడుదలైన నీటితో కోదాడ చెరువులను నింపకుండా పాలేరు రిజర్వాయర్కు తరలించడం వల్ల ఇక్కడి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనంతగిరి సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలోని చెరువులు నిండకపోవడానికి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డే బాధ్యత వహించాలన్నారు. మంత్రి సొంత జిల్లా రైతుల ప్రయోజనాలను విస్మరించారని, ప్రధాన కాలువలను శుభ్రం చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉపయోగంలో లేని లిఫ్టుల పేరుతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి పేరుతో మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్నాయక్, ఉపాధ్యక్షులు మట్టపల్లి పుల్లయ్యగౌడ్, ఎండీ అఫ్జల్, నాయకులు పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, మట్టపల్లి సైదులు, వివిధ గారమాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


