భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్ఓలకు అందిచేందుకు ఆగస్టు 3వరకు గడువు ఉండగా.. ఆలోగానే డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 96.76 శాతం ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా ఫారాలు తిరిగి తీసుకోవడంతో పాటు వాటిని ఆన్లైన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ముసాయిదా జాబితాలోంచి సుమారు 83,002 ఓట్లు తొలగించే అవకాశం ఉంది.
హుజూర్నగర్లో అత్యధికం
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 1,205 పోలింగ్ కేంద్రాలు, 10,08,252 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. బీఎల్ఓలు ఇప్పటి వరకు ఇంటింటికి తిరిగి ఫారాలు తిరిగి తీసుకొని వివరాలను 96.76శాతం డిజిటలైజేషన్ చేశారు. ఈ ప్రక్రియ అత్యధికంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో 99.82 శాతం పూర్తయింది. కోదాడలో 96.76 శాతం, తుంగతుర్తిలో 95.73 శాతం, సూర్యాపేటలో 95.57 శాతం మేర పూర్తయింది.
తొలగించే ఓట్ల గుర్తింపు
ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లు తిరిగి బీఎల్ఓలకు అప్పగించేందుకు ఆగస్టు 3 వరకు అవకాశం ఉంది. అదే రోజు వాటిని ఆన్లైన్ చేయనున్నారు. అర్హులైన ఓటర్లతో ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఓటర్లలో దాదాపు 83,002 మంది పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇందులో మృతిచెందిన వారు 25,037, శాశ్వతంగా జిల్లా నుంచి వలస వెళ్లిన వారు 39,046, ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారు 11,589 వరకు ఉన్నారు. ఇవే కాకుండా ఇతర కారణాలతో 7330 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఫారాలు అందించేందుకు మరో ఆరు రోజుల పాటు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యలో కొంత మేర మార్పులు ఉండనున్నాయి.
ఇప్పటి వరకు 96.76 శాతం
ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
మృతులు, వలస వెళ్లిన వారిని గుర్తిస్తున్న బీఎల్ఓలు


