భానుపురి (సూర్యాపేట) : ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు అని, ప్రభుత్వం ఆయా రంగాలను బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు మట్టిపల్లి సైదులు, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, బెల్లంకొండ సత్యనారాయణ, పల్లె వెంకట్రెడ్డి, వట్టెపు సైదులు, దండ వెంకటరెడ్డి, మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకుల ధర్నా


