సూర్యాపేట : త్వరలో పిల్లలమర్రి దేవాలయాలపై డాక్యుమెంటరీ ఫిలిం నిర్మిస్తామని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కలర్ హెరిటజ్ కేంద్ర కమిటీ సభ్యుడు మణికొండ వేదకుమార్ అన్నారు. ఆదివారం ిపిల్లలమర్రి దేవాలయాలను ఆయన సంస్థ నల్లగొండ జిల్లా సభ్యుడు పెద్దిరెడ్డి గణేష్తో కలసి పరిశీలించారు. ఎరుకేశ్వర, త్రికూటేశ్వర ఆలయాలు, అక్కడ ఉన్న చారిత్రిక ఆనవాళ్లు, శాసనాలు పరిశీలించారు. పిల్లలమర్రి దేవాలయాలపై డాక్యుమెంటరీ ఫిలిం నిర్మించి ఢిల్లీ సంస్థకు అందించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు సాధించి ఇలాంటి జాతీయ సంపదలను కాపాడి ముందు తరాలకు అందించ వచ్చని చెప్పారు. ఆయన వెంట ఇంటాక్ సభ్యులు భోనగిరి భాస్కర్,ఽ ధనంజయ తదితరులు ఉన్నారు.
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదురుకోళ్ల సంవాదం రక్తి కట్టించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, బదరీ నారాయణ చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, బ్రహ్మచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


