సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. శనివారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసి మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని, 100 శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలన్నారు. ఉదయం ఇన్ టైంలో పంచ్ చేయకపోయినా, సాయంత్రం ముందే వెళ్లిపోయినా శాఖాపరంగా చర్యలు ఉంటాయన్నారు. డ్రెస్ కోడ్ పాటించాలని, ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డాక్టర్లు జనార్దన్, అనిత, ఉపేందర్, యశ్వంత్, గీత, సంధ్య, వినయ్ పాల్గొన్నారు.


