అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం, నాగారం మండలం పేరబోయినగూడెంలలో మూసీనది ఇసుక క్వారీల నుంచి ప్రతిరోజు దాదాపు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా జరుగుతోంది. ఇక్కడి క్వారీల నుంచి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లకు సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేయడం, అతివేగంగా నడపడం, కొన్ని ట్రాక్టర్లకు సరైన పత్రాలు లేకపోవడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం మూలంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో నాగారం సీఐ నాగేఽశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాక్టర్ల సౌండ్బాక్స్లను తొలగించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అంటించారు. ట్రాక్టర్ డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేసుకోవాలన్నారు.


