నేటి సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మెలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభికం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
మహా శివరాత్రికి
ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజూర్నగర్ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు.
యాదగిరీశుడికి
విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేషంగా అభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన పూజలు చేశారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ఇక.. సాయంత్రం జోడు సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
సూర్యాపేటలో జోరుగా
నగదు, మద్యం పంపిణీ
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే నగదు, మద్యం, బహుమతులు (తాయిలాలు) జోరుగా పంపిణీ చేశారు. ముందుగా తమకు అనుకూలమైన ఓటర్లకు నగదు, మద్యం పంచారు. కొంతమంది ఓటర్లకు నగదు మద్యం పంపిణీ చేయకపోవడంతో డబ్బులు ఇస్తే కానీ ఓటేయమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో చేసేదేమీ లేక అభ్యర్థులు ఉదయం పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సమీపంలోని నగదు పంపిణీ చేశారు.
నేటి సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు
నేటి సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు


