కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాం
హుజూర్నగర్ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక పోలీస్ బందోబస్త్ నిర్వహించామని ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం హుజూర్నగర్లో మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఆయన సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 4గురు డీఎస్పీలు, 15 మంది సీఐలతో పాటు మొత్తం 1,250 మంది అధికారులు, సిబ్బందితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా రిజర్వు పోలీస్ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రెండు ప్లటూన్ల పోలీసులను వినియోగించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం సీసీ నిఘాలో పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్రూంలో పోలింగ్ బాక్స్లను భద్రపరిచామన్నారు. ఆయన వెంట సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం
సూర్యాపేట టౌన్ : జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్లలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం ఆయన పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కల్పించామన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని, ముందస్తు ప్రణాళిక, నిఘా వ్యవస్థ, నిరంతర పర్యవేక్షణ, ఫ్లాగ్ మార్చ్లు, సున్నిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలతో ఎన్నికలు శాంతియుతంగా సాగినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, మొబైల్ పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ల ఏర్పాటు ద్వారా ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫ ఎస్పీ నరసింహ


