31న ఉద్యోగ మేళా
భానుపురి (సూర్యాపేట) : ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 31న కలెక్టర్, డీఐఈఓ, హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు హెచ్సీఎల్ ప్రతినిధి సెల్ : 8341405102, 7981834205 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
వైభవంగా లక్ష్మీ నరసింహుడి కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి నాగవల్లీ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లంకు పోలీసుల నోటీస్
కోదాడ : ఈ నెల 24న కోదాడలో పోలీస్యాక్ట్ అమలులో ఉండగా పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారిపై ర్యాలీ, మీటింగ్ ఏర్పాటు చేయడంతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నోటీస్ను మంగళవారం పట్టణ పోలీసులు మల్లయ్య నివాసానికి వెళ్లి అందించారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఆయనపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలపాలని నోటీస్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ తాము సమావేశం ఏర్పాటు చేసిన రోజు ఎవ్వరికీ ఇబ్బంది కలగలేదని, నోటీస్కు చట్టపరిధిలో సమాధానం ఇస్తానని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు నిధులు కేటాయించాలి
సూర్యాపేట : వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు అధిక నిధులు కేటాయించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమ పోస్టర్ను మంగళవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు మహేశ్చారి, జిల్లా కన్వీనర్ రాజేశ్, సాయి, మధుసూదన్, ప్రవీణ్ పాల్గొన్నారు.
పారా మెడికల్ కౌన్సిలింగ్కు మరో అవకాశం
సూర్యాపేటటౌన్ : రెండు సంవత్సరాల పారా మెడికల్ కోర్సులో 2025–26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధించి కౌన్సిలింగ్కు హాజరు కాని విద్యార్థులకు మరో సారి అవకాశం కల్పించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 30న సూర్యాపేట జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అన్ని ఒరిజిల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు.
31న ఉద్యోగ మేళా
31న ఉద్యోగ మేళా


