నేటి నుంచి పూర్వగిరీశుడి అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ఉదయం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27 వరకు అధ్యయనోత్సవాలు కొనసాగనుండగా.. మరుసటి రోజు నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ వరకు భక్తులచే జరిపించే కల్యాణోత్సవం, జోడు సేవలతో పాటు 2వ తేదీన నిజాభిషేకం, అర్చనలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అధ్యయనోత్సవాలు ఇలా..
శనివారం ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుడతారు. సాయంత్రం తొళక్కం నిర్వహిస్తారు. 25న ఉదయం పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం, సాయంత్రం పురప్పాట్టు సేవ, దివ్య ప్రబంధ సేవాకాలం, 26న ఉదయం పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం, సాయంత్రం పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవా కాలం, నమ్మాళ్వార్ పరమపదోత్సవం, 27న ఉదయం పురప్పాట్టు సేవ, రామానుజాచార్య తిరుమంజనం, ఇరామానుజ నూత్తందారి శాత్తుమరై నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు.
28న బ్రహ్మోత్సవాలు షురూ..
పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 28న ఉదయం 10గంటలకు స్వస్తీ వాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వచ్చే నెల 3న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని 30న రాత్రి 7.30గంటలకు, తిరు కల్యాణోత్సవాన్ని 31న రాత్రి 7.30గంటలకు, వచ్చే నెల 1న రాత్రి దివ్య విమాన రథోత్సవం, 2న ఉదయం 10.30గంటలకు చక్రతీర్థం కార్యక్రమాలు జరిపించనున్నారు. తిరు కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా కల్యాణ టిక్కెట్ను రూ.600గా నిర్వహించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
తిరుమంజనంతో శ్రీకారం
నాలుగు రోజుల పాటు
విశేష కార్యక్రమాలు
28 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు


