వైభవంగా మట్టపల్లిలో తిరుకల్యాణోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం తెల్లవారు జామున వైభవంగా నిర్వహించారు. అర్చకులు కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మ నాభాచార్యులు, బ్రహ్మచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి బృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్రబెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు,తలంబ్రాలను సమర్పించి నిండు వైశాఖ పౌర్ణమి వెన్నెలలో కల్యాణతంతు జరిపించారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత ఉత్సవమూర్తులను గజ, సింహ, అశ్వ వాహనాలపై అశేషభక్తుల జయజయధ్వానాల నడుమ కల్యాణమండపం వరకు ఊరేగింపుగా తరలించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి యాదాద్రి కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తిలు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్లు శ్రీస్వామివారికి సమర్పించారు. గుండ్లపల్లి భక్తులు ఎదుర్కోళ్లదివిటీలు, పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామస్తులు, సూర్యాపేట జిల్లా లింగగిరి వాసులు శ్రీస్వామి, అమ్మవారికి మెట్టెలు, మంగళసూత్రం, ఉత్తర జంధ్యములు, వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు పర్యవేక్షణలో హరికిరణాచార్యులు, వెంకటాచార్యులు కల్యాణతంతు జరిపించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం అనంతరం గరుడవాహన సేవ నిర్వహించారు. నృసింహోపాసనం పద్యపఠనం, వేదపఠనం, భక్తిసంగీతం, శ్రీలక్ష్మీనరసింహస్వామి అవతార విశేషం హరికథ, శ్రీమట్టపల్లి క్షేత్రమహాత్యం బుర్రకథ , భక్తిసంగీత విభావరి నిర్వహించారు. అనంతరం రథోత్సవం చేపట్టారు.
వైభవంగా మట్టపల్లిలో తిరుకల్యాణోత్సవం
వైభవంగా మట్టపల్లిలో తిరుకల్యాణోత్సవం


