● ఏరులై పారుతున్న నాటు సారా ● రెండు రాష్ట్రాల అధికారుల సంయుక్త దాడులు ● కేసులు నమోదవుతున్నా తగ్గని అక్రమార్కులు
హిరమండలం:
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మహేంద్రగిరులు, ఇతర అటవీ ప్రాంతాల్లో సారా శిబిరాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాటినే చలామణి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్నా.. కేసులు నమోదుచేస్తున్నా అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సారాకు అలవాటుపడి ఎంతోమంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలవుతున్నారు. ప్రధానంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, టెక్కలి, సోంపేట, మందస, కంచిలి మండలాల్లోని సరిహద్దుల్లో సారా తయారీ ఎక్కువగా జరుగుతోంది. మరోవైపు సీతంపేట, భామిని, పాలకొండ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో తయారవుతున్న సారాను తెచ్చి మరీ విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి కూడా సరుకు బాగా దిగుమతి అవుతోంది.
ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై ఎక్కువగా ఎకై ్సజ్ అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సరిహద్దులోని రెండు రాష్ట్రాల పరిధిలో 10,510 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగించే 1.54 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నీటి లభ్యత అధికంగా ఉండే మారుమూల గిరిజన గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారు. వందల లీటర్ల నాటుసారాను నీటి క్యానులు, ప్యాకెట్లలో నింపి ద్విచక్ర వాహనాల్లో నిర్దేశించుకున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. కానీ సారా తయారీ, రవాణా మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చి మరీ తయారు చేస్తున్నారు. రవాణా మార్గాలను మారుస్తూ అధికారుల కళ్లుగప్పి గుట్టుగా సరిహద్దులను దాటించేస్తున్నారు. మరోవైపు ఎకై ్సజ్ శాఖలో సిబ్బంది కొరత అక్రమార్కులకు కలిసివస్తోంది.


