సర్కారుపై దుమ్మెత్తిపోసిన వైఎస్సార్ సీపీ నాయకులు
పలాస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ
విస్తృత స్థాయి సమావేశంలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు
కాశీబుగ్గ :
అలవి కాని హామీలతో చంద్రబాబు అధికారం దక్కించుకున్నారని, ఇప్పుడు అమలు చేయడం తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలాంటి మోస గాళ్లను ప్రజలు స్వాగతిస్తారా? అని ప్రశ్నించారు. పలాసలో శనివారం స్థానిక ఎన్నికల సంసిద్ధతపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఫలాలు ఎవరికీ అందడం లేదన్నారు. ఆనా డు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీకి భయపడిందని, కానీ నేడు వైఎస్సార్సీపీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడు తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లా డుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే తప్పుగా మారిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఇలాంటి దుర్నీతికి చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ చంద్రబాబు తనకు తాను వాటర్ మ్యాన్ అని బిరుదులు ఇచ్చుకుంటున్నారని, వాస్తవానికి వీధివీధికీ నీటిని కాకుండా మద్యాన్ని అందుబాటులో ఉంచుతూ క్వార్టర్ మ్యాన్గా మారారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వ హయాంలో పలాస నియోజకవర్గంలో మంచి నీళ్ల ట్యాంకులు చిన్నవిగానూ, వాటికి వేసిన శిలాఫలకాలు పెద్దవిగా కనిపిస్తున్నాయని చురకలు అంటించారు.


