కవిటి: ‘ఆఖరి మజిలీకి అగచాట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఈ మేరకు శనివారం ఆగిపోయిన కల్వర్టు కమ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీ సాయంతో దట్టంగా పేరుకుపోయిన ముళ్లపొదలను తొలగించడం ద్వారా ఈ మార్గంలో పెండింగ్లో పడిన మిగిలిన రహదా రి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వాస్తవానికి కలెక్టర్ మంజూరు చేసిన రూ.3.5లక్షల నిధులు వెచ్చించి ఇప్పటివరకు జరిగిన మేరకు పనులు నిర్వహించినట్టు పీఆర్ ఇంజనీర్ హిమ సాగర్ తెలిపారు. మిగిలిన పనులకు మండల పరిషత్ నిధుల నుంచి తాజాగా రూ.5లక్షలు వెచ్చించి చేపడుతున్నట్టు మండల పరిషత్ కార్యాలయం ఏఓ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు నిర్మాణ పనుల స్థలాన్ని సందర్శించి విలేకరులకు తెలిపారు.
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి పంచాయతీలో ‘తెనిగిపెంట కిడ్నీ వ్యాధుల తంటా’ అనే శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వైద్య, అర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు స్పందించారు. సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను అందజేశారు. సుమారు 50 మంది నుంచి రక్తం తదితర సమూనాలను సేకరించారు. గ్రామంలో మూడు రోజులు పాటు మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ నందిని తెలిపారు. అనారోగ్యానికి కారణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అర్డబ్ల్యూఎస్ ఏఈ మహేష్ తాగునీటి నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించారు. అనంతరం గ్రామంలోని వాటర్ ట్యాంక్, మురుగు కాలువలను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.


