జిల్లాలో గ్రామీణ ఓటర్ల సంఖ్య
అరసవల్లి: జిల్లాలో గ్రామీణ ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 16,09,818 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలను జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. వెంకటరామన్ శుక్రవారం వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 538 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, అలాగే 30 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 16,09,818 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 7,99,219 మంది పురుషులు, 8,10,544 మంది మహిళలు, 55 మంది ఇతరులు ఉన్నారని ఆయన వెల్లడించారు.


