అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ఇంద్రపుష్కరిణి పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, ఎర్త్ వర్కు బాగుంటేనే కాంక్రీట్ పనులకు అనుమతివ్వాలని దేవదాయ శాఖ డిప్యూటీ ఇంజినీర్ కె.కృష్ణ ఆదేశించారు. ఇటీవల ఇంద్రపుష్కరిణిలో నాణ్యతపై, ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ లోపంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు డీఈ కృష్ణ, ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్తో కలిసి పుష్కరిణి పనులను పరిశీలించారు. ఎర్త్ వర్క్ ఎంతో కీలకమని, గట్టిగా ర్యాంప్ తయారయ్యాకే కాంట్రాక్టర్కు కాంక్రీట్ పనులకు అనుమతులివ్వాలని ఏఈ నవీన్కుమార్ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని పరిశీలించాలని ఏఈ చందనకు సూచించారు. పుష్కరిణి చుట్టూ స్టీల్ బారికేడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఈవో ప్రసాద్ను ఆదేశించారు. ఎస్టిమేషన్లో లేని పనులను కూడా నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.


