కవిటి: ఆర్.బెలగాం పంచాయతీ బసవకొత్తూరులో శనివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఏర్పడిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సోంపేట అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ ఆర్.సూర్యారావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. గాయపడిన పిట్ట మహాలక్ష్మి, నీలగిరి భాగ్యలక్ష్మి, పిట్ట కుమారిలను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం, బరంపురం ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఈ ఘటనలో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. గృహోపకరణాలు, ఇంటి సామగ్రి, ఆహార ధాన్యాలకు నష్టం వాటిల్లింది. సుమారు రూ.1,50,000 నష్టం ఉంటుందని బాధితులు తెలిపారు.
తాపీమేస్త్రి ఆత్మహత్యాయత్నం
అనకాపల్లి: పట్టణంలోని జీవీఎంసీ విలీన గ్రామం రాజుపాలెం రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన తాపీమేస్త్రి అల్లాడ నరసింగరావు(31)ను స్థానికుల సహకారంతో అనకాపల్లి రూరల్ పోలీసులు రక్షించారు. రూరల్ ఎస్సై రవికుమార్ వివరాలు మేరకు.. శ్రీకాకుళం జిల్లా కాశింవలస గ్రామానికి చెందిన నరసింగరావుకు భార్యతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి అనకాపల్లి వచ్చి కొత్తూరులో ఉంటూ తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో శనివారం రాత్రి రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న సమయంలో స్థానికులు 100 నంబరుకు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు చేరుకుని రక్షించారు.


