● రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు ఎంపిక
● బోధనలో విశిష్ట సేవలతో అవార్డుకు ఎంపికై న గురువులు
శ్రమే పెట్టుబడి
జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెండ రామారావు రాష్ట్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఈ పాఠశాలకు వచ్చి రెండేళ్లవుతోంది. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పిల్లల సంఖ్య 9. రెండేళ్ల వ్యవధిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇప్పుడు 98 మంది చదువుతున్నారు. పాఠశాల సమయంలో తరగతులు చెబుతూ ఖాళీ సమయంలో వి ద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఒప్పించారు. తన సొంత నిధులు వెచ్చింది ఆటస్థలం అభివృద్ధి చేశారు. ఆట వస్తువులు తెప్పించి పలు మౌలిక సదుపాయాలూ కల్పించారు. సెలవు రోజుల్లోనూ బోధించడం ఈయన ప్రత్యేకత.
ముగ్గురూ ముగ్గురే. ఎవరి శైలి వారిది. పాఠాలు చెప్పడం దగ్గరి నుంచి బడిని తీర్చి దిద్దడం వరకు ఈ ముగ్గురిదీ విశిష్ట శైలి. అందుకే ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. సొంత డబ్బును పాఠశాలకు ఖర్చు పెట్టేది ఒకరైతే.. పిల్లలకు తరగతి పాఠాలతో పాటు కెరీర్ గైడెన్స్ ఇచ్చేది మరొకరు.. బోధనలో తనదైన ముద్ర వేసేది ఇంకొకరు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న మెండ రామారావు, వైజ హేమసుందరరావు, అల్లు అప్పన్న ముగ్గురూ జలుమూరు మండలానికి చెందిన వారే కావడం విశేషం. వీరిలో మెండ రామారావు జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాగా వైజ హేమసుందరరావు జలుమూరు బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. అల్లు అప్పన్న ఎచ్చెర్ల మండల కేశవరావుపేటలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా.. అవార్డు వచ్చిన సమయంలో డిప్యూటీ డీఈఓగా ఎంపిక కావడం గమనార్హం. –జలుమూరు
నిత్య హేమంతం
జలుమూరు బాయ్స్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తోన్న వైజ హేమసుందరావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డ్ వరించింది. బోధనలో హేమసుందరరావుది విశిష్ట శైలి. జలుమూరు పాఠశాలలో ఈ ఏడాది 30 మందిని కొత్తగా చేర్పించారు. విద్యా ప్రమాణాలు మెరుగు పరిచారు. ఎస్ఈఆర్టీ, ఎన్ఈఆర్టీలకు పుస్తకాలు రాసిన విశేష అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం పదో తరగతి బయాలజీ సిలబస్ టెక్ట్స్ బుక్ రచనలోనూ హేమ సుందరరావు పాలు పంచుకున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుడే జిల్లా ఉప విద్యాశాఖాధికారి
జిల్లా ఉప విద్యాశాఖ అధికారిగా అల్లు అప్పన్న ఎంపికయ్యారు. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన అల్లు అప్పన్న ఎచ్చెర్ల మండల కేశవరావుపేటలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఈయన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం గమనార్హం. జాతీయ, రాష్ట్రస్థాయిలో సెకండరీ స్థాయి గణిత పుస్తకాల రచ యితగా, మనోవికాస తరగతు ల నిర్వహణకర్తగా, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ ఆయన సేవలు చిరపరిచితం. బుడితి ఉన్నత పాఠశాలలో గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. కేశవరావుపేటలో లక్షలు విలువైన మౌలిక సదుపాయాలను కల్పించారు.


