నరసన్నపేట: సత్యవరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన కంటైనర్ డ్రైవర్ షేక్ రూఫా(55) మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి టెక్కలి వెళ్లే మార్గంలో సత్యవరం కూడలి సమీపంలో నేషనల్ హైవేకు చెందిన వాటర్ ట్యాంకర్ డివైడర్పై మొక్కలకు నీరు పోస్తుండగా అదే మార్గంలో పిడుగురాళ్ల నుంచి కటక్కు సున్నం ప్యాకెట్లతో వెళ్తున్న కంటైనర్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ ముందుభాగం పూర్తిగా నుజ్జయ్యింది. అందులో డ్రైవర్ షేక్ రూఫా తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని అంబులెన్స్లో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ప్రమాదం నుంచి వాటర్ ట్యాంకర్ డ్రైవర్, మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై బి.గణేష్లు ప్రమాద స్థలానికి వెళ్లి సమీక్షించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా మృతి చెందిన కంటైనర్ డ్రైవర్కు భార్య హసీనా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


