ఆమదాలవలస: స్థానిక పోలీసుస్టేషన్ పరిధి కొత్తరోడ్డు సమీపంలోని నాగావళి నది పరివాహక ప్రాంతంలో 2.5 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎం.సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సనపల బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా అలికాన నవీన్ కుమార్, చింతాడ దిలీప్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. మండల డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా నవీన్ కుమార్ వద్ద 1.5 కిలోలు, దిలీప్ వద్ద కిలో గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులిద్దరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని అంపోలు జిల్లా జైలుకు తరలించినట్లు వెల్లడించారు.


