వజ్రపుకొత్తూరు రూరల్: పలాస రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. కోల్కతా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలు పలాస రైల్వే స్టేషన్కు చేరుకున్న సమయంలో అసోంకు చెందిన మహిళా ప్రయాణికురాలు అజ్మినా ఖాన్ జారిపడటంతో గాయాల పాలైంది. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సత్యం, వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
సంతబొమ్మాళి: భర్తను కోల్పోయిన వేళ కుమారుడు విదేశాల్లో ఉండటంతో భార్యే తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సూరాడవానిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ మోహనరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన కుమారుడు విదేశాల్లో ఉండటంతో స్వగ్రామానికి చేరుకోలేకపోయారు. దీంతో మోహనరావు భార్యే భర్త అంత్యక్రియలను నిర్వహిస్తూ తలకొరివి పెట్టారు. మోహనరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...స్థానిక హడ్కో కాలనీకు చెందిన చుక్క సంతోష్ దొర (36) జూనియర్ లైన్మేన్గా విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పనిమీద కొత్త రోడ్ జంక్షన్ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా పాలకొండ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ హయర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష్కు భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


