శ్రీకాకుళం రూరల్: రాగోలు పంచాయతీ రాయిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పొలాల్లోకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. నేరుగా పొలాల్లోకి దూసుకుపోయినప్పటికీ ఎవరికీ ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కారును ఢీకొట్టిన లారీ
రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం రణస్థలం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ముగ్గురూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు పెట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
నేత్రదానంపై అవగాహన ర్యాలీ
శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తున్న ‘41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా 80 ఫీట్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆప్తాలమిక్ అధికారి ఎంఆర్కే దాస్ వాకర్లకు నేత్రదానం – కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వైశ్యరాజు తిరుమలరాజు, పొట్నూరు మాధవరావుల పిలుపుమేరకు 30 మంది వాకర్ల కుటుంబ సభ్యులకు దాస్ అవగాహన కల్పించారు. మరణానంతరం నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ పత్రాలు అందజేశారు.


