● సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ సాంబశివరావు ● టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో పారిశ్రామిక సదస్సు
టెక్కలి: విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే విస్తారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ జి.సాంబశివరావుతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం పారిశ్రామిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి కష్టపడేతత్వం ఉండాలని ఆకాంక్షించారు. పరిశ్రమల్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్ మేనేజింగ్ డైరక్టర్ డి.రామకృష్ణ మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను సద్వినియోగం చేసుకునే ప్రతీ విద్యార్థికి మంచి వేతనాలతో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎల్అండ్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సి.జయకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని వెల్లడించారు. నిర్మాణ రంగంలో ప్రస్తుతం విస్తారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రపంచం ఏఐ వైపు అడుగులు
బ్రైట్కాన్ చీఫ్ టెక్నికల్ అధికారి సీహెచ్ సోమేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఏఐ వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రతీ రంగంలో ఏఐ ఒక ప్రత్యక స్థానం సంపాదించుకుందని తెలిపారు. ఏఐలో మెలకువలు నేర్చుకున్న విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేవిధంగా సరైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి పారిశ్రామిక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా సుమారు 50 బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వివిధ కంపెనీలతో ఒప్పంద పత్రాలను పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కేవీఎం గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.నారాయణరావు, కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, ఇండస్ట్రీయల్ రిలేషన్ డీన్ బి.రాజేష్, ప్లేస్మెంట్ డీన్ ఎం.సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


