పరిశ్రమలకు రూటు
● మూలపేట పోర్టుతో పరిశ్రమల రాకకు మార్గం సుగమం
● పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన
కోరమాండల్ యాజమాన్యం
● నెరవేరుతున్న సిక్కోలు ప్రజల కల
మూలపేట పోర్టుతో తీర ప్రాంత అనుబంధ పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా వైఎస్ జగన్ ఆలోచన చేశారు. దానిలో భాగంగా పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే కోరమండల్ యాజమాన్యం ముందుకువచ్చింది. రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. 450 ఎకరాల్లో రూ.2,250కోట్ల వ్యయంతో పరిశ్రమ నిర్మించనుంది. రెండు వేల టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్, 650 టన్నుల పాస్పారిక్ యాసిడ్, వెయ్యి టన్నుల జిప్సం ప్లాస్టర్ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను కోరమండల్ యాజమాన్యం ఏర్పాటు చేయబోతోంది. దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభించడమే కాకుండా జిల్లాకు పారిశ్రామిక ఆదాయం పెరుగుతుంది. సహజంగా ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటుకు సముద్ర మార్గంలోనే ముడి పదార్థాలు దిగుమతి అవుతాయి. ఎక్కడైతే తీర ప్రాంతంలో పోర్టు ఉంటుందో అక్కడే ఫెర్టిలైజర్ పరిశ్రమలు ఏర్పాటు అవుతుంటాయి. పోర్టుకు దగ్గరగా ప్లాంట్ ఏర్పాటు జరిగితే రవాణా వ్యయం తగ్గి ఆ ప్లాంట్ అభివృద్ధిలో నడుస్తుంది. ఆ కారణాలతోనే ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో ఈ రకమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడా జాబితాలోకి మూలపేట పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా చేరబోతోంది. ఫెర్టిలైజర్ ప్లాంట్లకు పోర్టులే మూలధారం. వైఎస్ జగన్ కృషితో ఇప్పుడవి వస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
వైఎస్ జగన్ దార్శనికతతో సిక్కోలు కలలు నిజమవుతున్నాయి. దశాబ్దాల పాటు ఎన్నికల హామీగానే మిగిలిపోయిన మూలపేట పోర్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టాలెక్కించిన సంగతి జిల్లా వాసులందరికీ తెలుసు. భూమి సేకరించి, టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టి ఆగమేఘాల మీద ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ఇచ్చిన సపోర్టుతో సిక్కోలుకు పరిశ్రమల రాక మొదలవుతోంది. మూలపేట పోర్టు ఏరియాలో కోరమండల్ రసాయన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా వాసులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వైఎస్ జగన్ నిర్మించిన మూలపేట పోర్టు ఆ కలను సాకారం చేస్తోంది.
ఎన్నికల ముందే 70 శాతం పనులు పూర్తి..
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వలసలు తగ్గించేందుకు, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లో మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టింది. రూ. 4,361.91కోట్లతో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి. ఈ లోగా ప్రభుత్వం మారడంతో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పనులను తీవ్ర జాప్యం చేసింది. వైఎస్ జగన్కు క్రెడిట్ వెళ్లిపోతుందన్న ఉద్దేశంతో తాత్సారం చేసినా మారిటైం బోర్డు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోర్టు మిగతా పనులు పూర్తిగా చేయక తప్పడం లేదు. వైఎస్ జగన్ చొరవతో జిల్లా వాసుల కల నెరవేరబోతోంది. చంద్రబాబు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ పోర్టు ఆలోచన చేయలేదు. బావనపాడు పోర్టు వస్తుందంటూ ఇదిగో అదిగో అని చెప్పుకుని రావడం తప్ప పోర్టు నిర్మాణానికి కృషి చేయలేదు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్మాణంపై దృష్టి సారించారు. నిధుల సేకరణకు ప్రత్యేకంగా మారిటైం బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా భూసేకరణ దగ్గర నుంచి పునరావాస కాలనీ వరకు పూర్తి చేశారు. పోర్టుకు శంకుస్థాపన చేసి, పనులు చకచకా చేపట్టారు. పోర్టు పనులకు సమాంతరంగా రోడ్లు, రైల్వే లైన్ పనులు నిర్వహించారు. మొత్తానికి ఆయన అధికారంలో ఉండగానే 70శాతం పనులు పూర్తిచేశారు. మిగతా 30శాతం పనులు పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగా చంద్రబాబు ప్రభు త్వం సమయం తీసుకుంది. ఏదేతైనేమి సిక్కోలు వాసుల కళ్లముందే పోర్టు నిర్మాణం జరుపుకుంది. అందుబాటులోకి రానుంది.


