● తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు
● సర్వేల నిర్వహణ బాధ్యతలన్నీ వీరిపైనే
● ఏకంగా 38 రకాల సర్వేల నిర్వహణలో బిజీబిజీ
● పని ఒత్తిడితో మరణిస్తున్న ఉద్యోగులు
అరసవల్లి: సచివాలయం.. ఈ పేరే కొందరు ‘పెద్దలకు’ ఇష్టం లేనట్టు ఉంది. లక్షలాది మంది యువతకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసిన ఈ ఆలయాల్లో ఇప్పుడు చావు డప్పులు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖ రి.. వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులన్న కనీస గౌరవం లేకుండా ప్రతి చిన్న పనినీ వారికే అప్పగిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఏకంగా 38 రకాల సర్వేలంటూ ఊరంతా తిప్పుతుండడంతో తట్టుకోలేక చాలా మంది ప్రాణా లే వదిలేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిళ్లకు తాళలేక గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ స్ట్రోక్తో కొందరు మృత్యువాతకు గురయ్యారు. తాజాగా గార మండలానికి చెందిన రౌతు మెహర్ అనే డిజిటల్ అసిస్టెంట్ ఇచ్ఛాపురం మండలం మండపల్లి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్కు గురై ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇది నాలుగో మరణంగా నమోదై సంచలనమైంది. సచివాలయ వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో 75కు చేరిన మరణాలు
జిల్లాలో సచివాలయ ఉద్యోగుల మరణాలు నాలుగుకు చేరాయి. విధుల్లో లేని సమయాల్లో మరో ఇద్దరు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ట్విట్టర్ క్యాంపెయిన్ సమాచారం మేరకు 2024 సెప్టెంబర్ నుంచి ఈ నెల 15వ తేది లోపు సుమారు 75 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారని సంఘం సభ్యులు ప్రకటిస్తున్నారు. 30 ఏళ్ల వయస్సులోపు యువ ఉద్యోగులు ఇలా ప్రాణాలను కోల్పోతుంటే, సర్కార్ మొద్దు నిద్ర నటిస్తూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మన జిల్లాలో కూడా ఇప్పటికే నాలుగు మరణాలు సంభవించగా వివిధ కారణాలు చూపి రాజీనామా లు చేసిన వారి సంఖ్య పదుల్లో ఉంది. మరికొందరు లాంగ్ లీవ్ అంటూ సేవలకు దూరమయ్యారు. జిల్లాకు సంబంధించి అయితే లావేరు, శ్రీకాకుళం మండలాల్లో ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారు. అయితే గత ఏడాది తీవ్ర ఒత్తిళ్లతో లావేరు మండలం బుడతవలస సచివాలయ సర్వేయర్గా పనిచేస్తున్న పొట్నూరు రాఘవరావు గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ సచివాలయ వార్డు ఎమినిటీ సెక్రటరీ పల్లె దాలినాయుడు అనే ఉద్యోగి కూడా బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిన ఘటన చోటుచేసుకుంది.
ఒత్తిడితోనే విధులు
ప్రతి నెలా ఏకంగా 38 సర్వేలను చేయడం టార్గెట్గా చేసుకుంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, పీఎం కిసాన్ డ్రోన్స్ ఓబురేషన్ స ర్వే, ఎన్సీడీసీ సర్వే, ఇ–క్రాప్ బుకింగ్ సర్వే, ఎఫ్ఎం సర్వే, ఆధార్ సర్వే, కౌశలం సర్వే, మనమిత్ర ద్వారా అందిస్తున్న 564 సేవలపై సర్వే, కొత్త రేషన్ కార్డుల సర్వే, బయోమెట్రిక్ అప్డేషన్ సర్వే, పి–4, పాస్బుక్స్ సర్వే, ఎహెచ్ఎస్ సర్వే, అభ సర్వే, సెమి ఆర్ఫన్ సర్వే తదితర 38 రకాల సర్వేలతో పాటు నెలవారీ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, ఆఖరికి బూత్లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) బాధ్యతలను, సెన్స స్ కూడా సచివాలయ ఉద్యోగులు చేపట్టాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. దీంతో పాటు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో తిట్లు, చీవాట్లు నిత్యకృత్యం. ఇలాంటి దుర్భర పరిస్థితుల నడుమ సచివాలయ ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు చిన్నపాటి కారణాలు చూపుతూ, ఐవీఆర్ఎస్ కాల్స్ సాకుగా చూపుతూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ‘స్థానిక’ ఎన్నికలంటూ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మరెంత ఒత్తిడి పెరుగుతుందో అని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
సచివాలయ ఉద్యోగులకు ఉన్న విధులతో పాటు 38 సర్వేలను చేస్తూనే ఎన్నికల బీఎల్ఓ విధులను కూడా కట్టబెట్టారు. ఇవే తీవ్ర ఒత్తిడి పెంచి మా ప్రాణాలపైకి తెస్తున్నాయి. బీఎల్ఓ అధికారాలు 14 ప్రభుత్వ ఉద్యోగ శాఖలకు ఉన్నప్పటికీ, కేవలం సచివాలయ ఉద్యోగులకే కట్టబెడుతూ ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే అధికారికంగా నలుగురు ఉద్యోగులు ఒత్తిళ్లతోనే మృత్యువాత పడ్డారు. తాజాగా రౌతు మెహర్ కూడా డిజిటల్ అసిస్టెంట్ విధులతో పాటు సెన్సస్ టెక్నికల్ మండల కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా ఇవ్వడంతో ఒత్తిడి పెరిగి బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యాడు. ఈ మరణాలన్నీ సర్కార్ హత్యలుగానే భావిస్తున్నాం. దీనిపై నిరసన కార్యక్రమాలను నేటి (శనివారం) నుంచి ప్రారంభిస్తాం.
– కూన వెంకట సత్యనారాయణ,
సచివాలయ ఉద్యోగుల సంఘ జేఏసీ ప్రతినిధి


