న్యూస్రీల్
గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కదం తొక్కిన విద్యార్థులు
● శ్రీకాకుళం–రాజాం ప్రధాన రహదారిలో పొగిరి వద్ద విద్యార్థుల ధర్నా ● ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆందోళన ● భారీగా నిలిచిపోయిన వాహనాలు
జి.సిగడాం:
‘ఉన్నవే కొద్దిపాటి బస్సులు.. అవి కూడా బస్టాండ్లలోనే ఫుల్ అయిపోతున్నాయి. బస్ కూడ ళ్లు, స్టాప్ల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులను చూసి కూడా బస్సులు వెళ్లిపోతున్నాయి. మరి బస్ పాస్ లు తీసుకుని ప్రయోజనం ఏమిటి.? ఇదేం పాలన’ అంటూ విద్యార్థులు కదం తొక్కారు. జి.సిగడాం మండలానికి వెళ్లే ప్రధాన రహదారిలో రాజాం మండలం పొగిరి కూడలి వద్ద బుధవారం ఈ ఆందోళన జరిగింది. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారి మధ్య పొగిరి కూడలి ఉంది. ఇక్కడకు రాజాం మండలం పొగిరి, జి.సిగడాం మండలం పెంట, సీతంపేట, గేదెలపేట, జి.సిగడాం, లింగాపురం టీడీవలస, మానంపేట, మర్రివలస ప్రయాణికులు, విద్యార్థులు వస్తుంటారు. ప్రతి రోజు వందలాది మంది ఈ సెంటర్ నుంచే అటు శ్రీకాకుళం, ఇటు రాజాం, మరో వైపు జి.సిగడాం వెళ్తుంటారు. ఇటు రాజాం నుంచి శ్రీకాకుళం, జి.సిగడాం వెళ్లే బస్సులతో పాటు అటు శ్రీకాకుళం, పొందూరు, జి.సిగడాం నుంచి వచ్చే బస్సులు ఇక్కడ ఆపడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. బస్ పాస్లు తీసుకుని కూడా డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో విసిగిపోయిన వీరంతా బుధవారం రోడ్డుపై ఆందోళనకు దిగారు. బస్సులు ఖాళీ ఉండడం లేదని, కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని ఈ కారణంగానే కూడళ్లు వద్ద ఆపలేకపోతున్నామని ఆర్టీసీడ్రైవర్లు సమాధానం చెప్పారు. గతంలో మాదిరిగా ఆర్టీసీ సర్వీసులు లేవని, తగ్గించేశారని చెప్పడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. తమ సమస్య పరిష్కరించేవరకూ ఏ బ స్సును కదలనివ్వబోమని రోడ్డుపై బైఠాయించారు.
పోలీసుల రంగప్రవేశం
పొగిరి సెంటర్లో విద్యార్థుల నిరసన విషయాన్ని తెలుసుకున్న రాజాం పట్టణ సీఐ డి.నవీన్ హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఈ నిరసన కార్యక్రమం కారణంగా పొగిరి కూడలికి రెండు వైపులా కిలోమీటరు మేర ఆర్టీసీ బస్సులు, పైవేట్ వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థులతో సీఐ మాట్లాడినా లాభం లేకపోవడంతో.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ఉదయం, సాయంత్రం సర్వీసులు పెంచుతామని, ఇక్కడ బస్సులు ఆపుతామని చెప్పడంతో నిరసన కార్యక్రమం సద్దుమణిగింది.


