జేసీ, కలెక్టర్ పట్టించుకోరా?
● సీఎంఆర్ అక్రమాలు కలెక్టర్, జేసీకి పట్టవా? ● ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న ధాన్యంకు పీడీఎస్ బియ్యం అందజేస్తున్న మిల్లర్లు ● పెందుర్తి, చీపురుపల్లిలో ఇప్పటికే బయటపడిన సీఎంఆర్ అవినీతి బాగోతాలు ● పట్టించుకోని జిల్లా అధికారులు ● సీఎంఆర్ అవినీతి పునరావృతం అవుతున్నా అప్రమత్తం కాని దుస్థితి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ బదులు రేషన్ బియ్యాన్ని మళ్లీ ప్రభుత్వానికి కట్టబెడుతున్న దాఖలాలు పక్క జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. తీగ దొరికినా డొంక కదిల్చే ప్రయత్నం మన అధికారులు చేయడం లేదు. పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు, మిల్లులకు కేటాయింపులు, ఆడించినాక ఇచ్చే సీఎంఆర్పై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలి. కానీ అక్రమాల ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నా మన అధికారులు మౌనం వహిస్తున్నారు.
●ఈ ఏడాది మే నెలలో పెందుర్తి గోడౌన్కు జిల్లాకు చెందిన 56 మిల్లుల నుంచి వేలాది మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కింద పీడీఎస్ బియ్యం పంపించారు. దీనిపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. హెడ్ ఆఫీస్తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సివిల్ సప్లయ్ డీఎం స్థాయి అధికారులు తనిఖీ నిర్వహించి, విచారణ జరిపారు.
●జూన్ నెలలో చీపురుపల్లి మండలం పత్తికాయవలస స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్కు జిల్లాకు చెందిన 32 మిల్లుల నుంచి వేలాది టన్నుల సీఎంఆర్ కింద పీడీఎస్ బియ్యం పంపించారు. దీంట్లో నరసన్నపేటకు చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి, మిల్లర్దే ఎక్కువగా ఉంది. విశాఖ జిల్లా అవసరాల కోసం కేటాయించడంతో అక్కడ పలు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద విశాఖ జిల్లా సివిల్ సప్లయి అధికారులు తనిఖీ చేసిన సందర్భంలో సీఎంఆర్లో తేడా గుర్తించారు. పీడీఎస్ బియ్యం పోలిన విధంగా ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెడ్ ఆఫీస్ నుంచి అధికారులు వచ్చి విచారణ జరిపారు.
బయటపడిన బాగోతాలు
పొరుగు జిల్లాలో ఈ సీఎంఆర్ బాగోతాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంతో సివిల్ సప్లయి శాఖలో భారీగా కుదుపు చోటు చేసుకుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు గొడౌన్లకు ఇచ్చిన సీఎంఆర్లో కూడా ఇదేరకమైన అవినీతి బాగోతం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ స్థాయిలో అధికారుల తనిఖీలు జరపకపోవడంతో గుట్టు రట్టు కావడం లేదు.
ఏటా ప్రభుత్వం రైతుల దగ్గరి నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తుంది. అక్కడ ఆడించాక వచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అటు ఎఫ్సీఐ గోడౌన్లకు, జిల్లాలోని ప్రైవేటు గోడౌన్లకు పంపించాలి. జిల్లాలో నిల్వ సామర్థ్యం లేక పెందుర్తి, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లోని గోడౌన్లకు పంపిస్తుంది. అక్కడి నుంచి ప్రభుత్వ అవసరాలకు బియ్యం ఇవ్వాలి. కానీ సీఎంఆర్ కింద పాత రేషన్ బియ్యాన్ని ఇచ్చేసి, సీఎంఆర్ను ప్రైవేటు మార్కెట్కు అధిక ధరకు విక్రయించుకుంటూ మిల్లర్లు లబ్ధి పొందుతున్నారు.
జిల్లాలోని మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, ఆడించాక ఇవ్వాల్సిన సీఎంఆర్, మిల్లు ఆడేందుకు వినియోగిస్తున్న విద్యుత్, గోడౌన్లకు సీఎంఆర్ను పంపించే లారీల జియో ట్రాకింగ్పై పర్యవేక్షణ ఉందో లేదో అన్నట్టుగా ఉంది. వాస్తవంగా, మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఆడించేందుకు ఎంత విద్యుత్ వినియోగం అవుతుందన్నదానిపై అంచనా ఉంటుంది. ఆ మేరకు వినియోగమైతేనే ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఆడించినట్టుగా అవుతుంది. లేదంటే, ధాన్యం పక్కదారి పట్టించి, సీఎంఆర్ ముసుగులో పీడీఎస్ బియ్యం ఇచ్చినట్టే అవుతుంది. అదే విధంగా సీఎంఆర్ను కేటాయించిన గోడౌన్లకు లారీల ద్వారా పంపించినప్పుడు జియో ట్రాకింగ్ ఉంటుంది. ఆ ట్రాకింగ్ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నా యి. అలాగే, మిల్లుల్లో ఎప్పటికప్పుడు నిల్వలు తనిఖీలు చేస్తేనే గుట్టు రట్టు అవుతుంది.
పౌరసరఫరాల సంస్థ డీఎంతో పాటు జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కూడా వందల కోట్ల మేర లావాదేవీలు జరిగే ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ఓపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలి. తనిఖీలు చేసి, లోపాలుంటే చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా జిల్లాలో జరకపోవడంతో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఆడించి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద పీడీఎస్ రైస్ను దర్జాగా మిల్లర్లు పంపించేస్తున్నారు.


