●చింతాడ రవిని న్యాయస్థానం ముందు హాజరు పరిచే యత్నంలో పోలీసుల అత్యుత్సాహం ●నిబంధనలకు విరుద్ధంగా నడిపించి కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు ●హత్యాయత్నం, ఉద్దేశపూర్వక నేరం సెక్షన్లు వర్తించవన్న న్యాయమూర్తి ●చింతాడకు 13 రోజుల రిమాండ్ ●చింతాడ రవితో పాటు ఆదివారం మరో నలుగురికి రిమాండ్
శ్రీకాకుళం క్రైమ్ :
ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చింతాడ రవికి జిల్లా న్యాయస్థానం నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అనురాగ్ ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. చింతాడ రవి తో పాటు కుసుమంచి హరీష్కుమార్, ఇప్పిలి శశికి కూడా రిమాండ్ విధించారు. ఆదివారం ఉదయం ఇదే కేసుకు సంబంధించి దానేటి రామ్మోహన్, పాగోటి భాను ప్రకాష్లకు జడ్జి రిమాండ్ విధించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నాడు విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఎం.ప్రవళ్లికపై చింతాడ రవితో పాటు మరో 20 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారంటూ హత్యా యత్నం, మరికొన్ని సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే జడ్జి అనురాగ్ పోలీసుల రిమాండ్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 109 (హత్యాయత్నం), 111 (ఉద్దేశపూర్వకంగా నేరం చేయడం) వంటి సెక్షన్లు వర్తించవని పేర్కొనడం విశేషం. మాజీ సీఎం వైఎస్ జగన్పై అభిమానంతో చూసేందుకు వచ్చిన చింతాడ రవి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు బెయిల్ రాకూడదని, రిమాండ్లో ఉంచాలనే దురుద్దేశంతోనే టీడీపీ అధిష్టానం నుంచి లోకల్ క్యాడర్ వరకు పోలీసులను పావుగా వాడుకొని పెట్టిన హ త్యాయత్నం, ఆర్గనైజింగ్ క్రైమ్ సెక్షన్లు వర్తించవని జడ్జి చెప్పడం వైఎస్సార్ సీపీ నాయకులకు ఊరట కలిగించింది. మొదటగా కేసు కట్టిన 21 మందిలో ఏడుగురిని, తర్వాత కేసులో కలిపిన ఏడుగురితో కలిపి మొత్తంగా 14 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల అత్యుత్సాహం
శనివారం రాత్రి చిలకపాలెంలో చింతాడ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా లావే రు, తర్వాత పైడి భీమవరం సిస్కో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడి నుంచి అర్ధరాత్రి పాతపట్నం పోలీ స్ స్టేషన్కు తరలించిన విషయం విధితమే. అక్కడి నుంచి ఉదయమే రిమాండ్కు తరలించే వెసులుబా టు ఉన్నా కావాలనే విచారణ పేరుతో సాయంత్రం 5 వరకు ఉంచేశారు. జిల్లా కోర్టు వద్దకు రవిని తెస్తున్నారన్న సమాచారంతో జిల్లా కోర్టు వద్ద భారీ గా పోలీసులు మోహరించారు. సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయం ముందుకు రవితో పాటు మరో ఇద్దరిని తీసుకొచ్చిన వ్యానును ఆపేసి అక్కడి నుంచి కోర్టుకు నడిపించుకుని తీసుకెళ్లారు. రోడ్డుపైనే ఉన్న చింతాడ రవి అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు జై జగన్, జై చింతాడ రవి అంటూ నినాదాలు పలికారు. అక్కడ కొంతసేపు రికార్డ్ వర్క్ అయ్యాక రాత్రి 7.20 గంటలకు ఏఎస్ఎన్ కాలనీ వద్దనున్న జడ్జి నివాసం వద్దకు తీసుకెళ్లే క్ర మంలో తుపాకుల బిల్డింగ్ సమీపాన ఆపేసి మళ్లీ 500 మీటర్ల మేర నడిపించి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం ఇలా నడిపించకూడదు. అయినా పోలీసులు ఆ నిబంధనలను కాలరాశారు.
కోర్టుకు పోలీసులు తీసుకెళ్లే క్రమంలో చింతాడ రవి మీడియాతో మాట్లాడుతూ.. ‘జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్కు ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారు. కూటమి ప్రభు త్వం దురాగతమిది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దురాగతానికి పరాకాష్ట ఇది. ఎక్కడా జరగని ఇన్సి డెంట్ను ఓ పెద్ద బూచిలా చూపించి ఆమదాలవలసలో ఎంతోమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
చింతాడ రవితో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసులు కట్టారు. రవితో పాటు మరికొంత మందికి ఈ నెల 21 వరకు రిమాండ్ ఇచ్చారు. వీరిని ఎలాగైనా జైలులో ఉంచాలని పోలీసులు పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టారు. జుడీషియల్ ఆఫీసర్ పసిగట్టి ఎటెంప్ట్ మర్డర్ కేసు, ఆర్గనైజ్డ్ క్రైమ్ వర్తించవని రిమాండ్ రిపోర్టులో రాశారు. బెయిల్ కోసం అప్లై చేశాం.
– చాపురం రమేష్, చింతాడ రవి తరఫు న్యాయవాది


