జనవరి 19 నుంచి రథసప్తమి మహోత్సవాలు
అరసవల్లి: రానున్న రథసప్తమి మహోత్సవాలను రాష్ట్ర పండుగగా తొలిసారిగా ఏడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు శనివారం సా యంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఊహించిన మేరకు స్వచ్ఛంద సంస్థలు, అనుభవమున్న స్థానికులు సైతం పెద్దగా హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి రథసప్తమికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా హాజరయ్యేలా ప్రణాళిక వేస్తున్నామని, ఇప్పటికే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన ఖరారైందని ప్రకటించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ జనవరి 19న ఆలయ అనివెట్టి మండపంలో ప్రజాసంకల్ప పూజలు, సాయంత్రం తిరువీధి, 20న ఆదిత్యుని ఉత్సవమూర్తులకు స్నపన కార్యక్రమం, 21న ఉత్సవమూర్తుల స్వర్ణాలంకరణ సేవ, 22న లక్ష పుష్పాలంకరణ, 23న సామూహిక సూర్యనమస్కారాలు, 24న మహా సౌర హోమం, 25న రథసప్తమి నాడు అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పంచామృతాలతో అభిషేకసేవ, అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిజరూప దర్శనం తర్వాత అలంకార సేవ, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ప్రకటించారు.
చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శోభ, ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ మాట్లాడుతూ..ఈసారి దర్శన టిక్కెట్లతో పాటు వీఐపీ పాసులు, దాతల పాసులకు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.


