
ఉపాధి వేతనదారుడు మృతి
సరుబుజ్జిలి: మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన గుజ్జల గన్నెరాజు(67) ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న సమయంలో శనివారం ఆకస్మికంగా మృతిచెందాడు. తోటి వేతనదారులతో కలిసి కాలువలో మొక్కలు తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. తోటి వేతనదారులు వచ్చి సపర్యలు చేసినా అప్పటికే చనిపోయాడు. టెక్నికల్ అసిస్టెంట్ లలితమ్మ, ఫీల్డ్అసిస్టెంట్ శ్రీరాములు ఇచ్చిన సమాచారం మేరుకు ఏపీఓ పార్వతి ఘటనా స్థలానికి వచ్చి విషయం తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గన్నెరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పిచ్చికుక్క దాడిలో 10 మందికి గాయాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తిలక్నగర్ ప్రాంతంలో రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. పది మందికిపైగా గాయాలపాలయ్యారు. బాధితులు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి చేరుకుని టీకాలు వేయించుకుంటున్నారు. మున్సిపాలిటీలో కుక్కల బెడద ఇటీవల కాలంలో ఎక్కువైంది. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం–సుర్లా రైల్వేస్టేషన్ల మధ్య శనివారం గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి.హరినాథ్ తెలిపారు. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండవచ్చని, పసుపు లాల్చీ, నీలం రంగు పువ్వులు కలిగిన లుంగీ ధరించాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జీఆర్పీ ఎస్సై ఎస్కే షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించాలి
శ్రీకాకుళం అర్బన్: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ మౌలిక సూత్రాల రక్షణ అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.గేయానంద్ అధ్యక్షతన సమావేశం వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఎంబీవీ కేంద్రంలో ఏప్రిల్ 26, 27లలో జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజంలపై జరుగుతున్న దాడిని ప్రజాసైన్స్ ఉద్యమం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీడీఎఫ్ పూర్వ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) కార్యవర్గ సభ్యులు జి.మురళీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు రెడ్డి, వైస్ నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, సమత రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ ఖాలీషా బాషా, బి.మాణిక్యం శెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి వేతనదారుడు మృతి

ఉపాధి వేతనదారుడు మృతి