మడకశిర: నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు మిన్నంటుతున్నాయి. పర్యవేక్షణ లేక...పట్టించుకునే వారు లేక తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతుండగా... కడుపుమండిన జనం ఊరూరా ఖాళీ బిందెలతో బైఠాయిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ కేంద్రమైన మడకశిరలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వారంతా గురువారం రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని పావగడ–తుమకూరు ప్రధాన రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, 20 రోజులుగా తమ కాలనీకి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా తాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని తమ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు. తాగునీటి సమస్య పరిష్కరమయ్యేంత వరకూ తాము ఇక్కడి నుంచి కదలబోమన్నారు. చివరకు మున్సిపల్ అధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.


