అమరాపురం: గ్రామానికి ఉపయోగపడే చెరువు స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హనుమంతు హెచ్చరించారు. మండల పరిధిలోని తమ్మడేపల్లి గ్రామ చెరువు స్థలంలో కొందరు పంటలు వేస్తూ కబ్జా చేయగా...జీవాలకు మేత దొరక్క గొర్రెలు కాపరులు ఆందోళన చెందుతున్న వైనంపై ‘చెరువు కబ్జాపై గొర్రెల కాపరుల సమరభేరి’ శీర్షికన శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన తహసీల్దార్ హనుమంతు రెవెన్యూ అధికారులతో కలిసి సోమవారం తమ్మడేపల్లి గ్రామ చెరువును సందర్శించారు. చెరువు భూమిని ఎవరు ఆక్రమించారు, ఎంత ఆక్రమించి సాగు చేస్తున్నారు... తదితర వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెరువులో స్థలంలో సాగుచేసిన పంటలను పరిశీలించారు. అనంతరం చెరువు స్థలంలో పంటలు సాగు చేసిన రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తహసీల్దార్తో మాట్లాడుతూ... తాము పశువులకు గ్రాసం కోసమే చెరువు స్థలంలో సాగు చేశామని, పంట తొలగించిన తర్వాత మళ్లీ సాగు చేయబోమని తహసీల్దార్కు తెలిపారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ...చెరువు 534.5 ఎకరాల్లో ఉందని, విస్తీర్ణాన్ని మరోసారి కొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమంగా ఎవరైనా చెరువు భూమిని ఆక్రమించి ఉంటే వారికి నోటీసులు అందజేసి సత్వరమే చెరువు పొరంబోకు స్థలాన్ని ఖాళీ చేయిస్తామన్నారు. తహసీల్దార్ వెంట మండల సర్వేయర్ పుట్టరాజు, ఆర్ఐ విన్సెంట్పాల్, వీఆర్ఓ మహేంద్ర, కార్యదర్శి యోగానంద, ఇరిగేషన్ ఏఈ, రైతులు ఉన్నారు.
హెచ్చరించిన
తహసీల్దార్ హనుమంతు


