ఈ చిత్రంలో కనిపిస్తున్న వారంతా ఓడీచెరువు మండలం శేషయ్యగారిపల్లి తండావాసులు. తండాలోని బోరు పనిచేయకపోవడంతో ఆరు నెలలుగా ఇలా పొలాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. పొలాల్లో త్రీఫేస్ కరెంటు ఉన్నప్పుడే బోర్లు పనిచేస్తుండగా...నీటి కోసం పనులు సైతం మానుకుంటున్నారు. మడులు ఉన్న పొలంలోనే నీళ్లు వస్తున్నాయని, నీటికోసం మడి గట్టుపై నడిచే సమయంలో జారిపడి ఎందరో గాయపడ్డారని తండావాసులు వాపోయారు. ఆరునెలులుగా తమ కష్టాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా అధికారుల మనసు కరగలేదని, కనీసం స్థానిక ఎమ్మెల్యే అయినా పట్టించుకుంటారేమోనని ఎదురు చూశామని, కానీ ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ పథకమూ అడగలేదని, కాసిన్ని నీళ్లుమాత్రమే అడిగామన్నారు. తండా జనమని తమను చిన్నచూపు చూస్తున్నారని ఆక్రోశం వెలిబుచ్చారు. – ఓడీచెరువు :
పొలంగట్ల మీద నుంచి నీటిని తెచ్చుకుంటున్న శేషయ్యగారిపల్లి తండా మహిళలు


