కదిరి టౌన్: వాల్మీకులకు కేటాయించిన సర్వే నంబర్ 86లోని 2.96 ఎకరాల భూమిని టీడీపీ నేత బంగారు క్రిష్ణమూర్తి కబ్జా చేసి, తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వాల్మీకి సంఘం నాయ కులు ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కదిరి డిఎస్పీ శివనారాయణస్వామికి ఫిర్యాదు చేశారు. స్వార్థ బుద్ధితో ఆలోచించి వాల్మీకి జాతికి క్రిష్ణమూర్తి తీరని ద్రోహం చేశాడని విమర్శించారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు గంగరాజు, నాగరాజు, ఈశ్వర్, పట్నం మహేష్, పూల సురేష్, రామాంజనేయులు, ప్రసాద్, గిరి, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బీబీ జైనబ్బీ గంధం వేడుకలు
ఉరవకొండ: ప్రసిద్ధి గాంచిన హజరత్ బీబీ జైనబ్బీ అమ్మవారి ఉరుసు బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు విశేష పుష్పాలతో అలంకరించిన ముత్యాల హంస పల్లకీలో అమ్మవారి పవిత్ర గంధం ఉంచి మేళతాళాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూరుబాషా ఆధ్వర్యంలో సభ్యులు అమ్మవారి జీవసమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. దర్గా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఊరేగింపులో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


