ఓడీచెరువు: సోలార్ కంపెనీల నుంచి రైతుల భూములను కాపాడాలని, సోలార్ పరిశ్రమలతో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మించి చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు సాగునీటిని అందించి ఆదుకోవాలని కోరారు. ఓడీచెరువు, అమడగూరు, నల్లమాడ మండలాలలో ఏర్పాటు చేయనున్న 16 పరిశ్రమలకు సంబంధించిన భూములను పరిశీలించారు. తప్పని పరిస్థితుల్లో భూములను లీజుకు ఇవ్వదలిస్తే ఎకరాకు సంవత్సరానికి రూ.50 వేలు, ప్రతి సంవత్సరం పది శాతం పెంచి లీజు తిరిగి రాయాలని, దీర్ఘకాలిక ఒప్పందాలకు రైతులు ససేమిరా ఒప్పుకోవద్దని కోరారు. బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు జిల్లా సహకార కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మాధవ రెడ్డి, రామిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు


